Saturday, 14 May 2011

బుద్ధి తెచ్చుకుని మసలుకోండి


న్యూఢిల్లీ, మే 13: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాతనైనా బిజెపి, వామపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు. కేంద్రంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని అన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం అధిపతి జనార్దన్ ద్వివేదీతో కలిసి ప్రణబ్ విలేఖర్లతో మాట్లాడారు. ఏఐసిసిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి, వామపక్షాలపై దుమ్మెత్తిపోశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు మార్పును కోరుకున్నారు. అస్సాం ప్రజలు స్థిరమైన ప్రభుత్వం, అభివృద్ధిని కోరుకున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా తమ తీర్పు ఇచ్చారని ప్రణబ్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో ప్రజల ఓట్ల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బిజెపి ఈ అవకాశం కోసం వేచి చూడాలి. అయితే యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని, వ్యవస్థను అస్థిర పరచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలో దాదాపు 824 సీట్లు ఉన్నాయి. బిజెపి ఈ సీట్లన్నింటిలో తమ అభ్యర్థులను నిలబెట్టకపోయినా ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. వారికి మిగిలింది ఏమిటని ప్రణబ్ నిలదీశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి ఒక్క సీటు కూడా రాలేదు. బెంగాల్‌లో ఒక్క సీటు వస్తే అస్సాంలో ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద వారి సీట్ల సంఖ్య రెండంకెల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి 2008లోనే అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుని మమతా బెనర్జీకి అనుకూలంగా ఓటు వేశారు. ఇది మమతా బెనర్జీ విజయమని ఆయన అంగీకరించారు. ఇక వామపక్షాల బలం మూడంకెల నుండి రెండు అంకెలకు తగ్గిపోయిందన్నారు. అస్సాంలో కాంగ్రెస్ బలం 53 నుండి 78 పెరగటం పట్ల ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ శిరసావహిస్తుందని చెబుతూ తమ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన డిఎంకెతో సంబంధాలు యథాతధంగా కొనసాగుతాయా? అన్న ప్రశ్నపై ప్రణబ్ మాట్లాడుతూ ఫలితాలు ప్రతికూలంగా వచ్చినంత మాత్రాన తమ స్నేహంలో ఎలాంటి మార్పు రాదన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి అత్యంత సహజమన్నారు. కాంగ్రెస్‌కు ఏ పార్టీ శతృవుకాదు, అందరితో స్నేహం చేస్తామని తెలిపారు. అలాగని ఓడిపోయినంత మాత్రాన ఒకప్పుడు లోక్‌సభలో కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగి ఉన్న బిజెపి ఆ తరువాత కేంద్రంలో అధికారంలోకి రాలేదా? అని ఆయన ప్రశ్నించారు.

No comments:

Post a Comment