Saturday, 14 May 2011

కాంగ్రెస్‌లో కలవరం


న్యూఢిల్లీ, మే 13: కడప లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భారీ మెజారిటీ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. జగన్ దాదాపు ఐదు లక్షల యాభై వేల మెజారిటీతో అద్భుత విజయం సాధించటం, ఆయన తల్లి విజయలక్ష్మి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 86 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్, విజయలక్ష్మిలకు మెజారిటీ వస్తుందని హైకమాండ్ అంచనా వేసింది. కానీ ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించలేకపోయారు. ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ఐదున్నర లక్షల మెజారిటీతో లోక్‌సభకు మళ్లీ ఎన్నికల కావడం ఎటు దారితీస్తుందనేది అధినాయకత్వానికి అర్థం కావటం లేదు. ఒక వైపు జగన్ రాజకీయం మరోవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ అధినాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ సమస్యను పరిష్కరించలేకున్నా జగన్ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జగన్‌ని కాంగ్రెస్‌లోకి తెప్పించుకునేందుకు ప్రమత్నించటం ద్వారా ఈసమస్యను పరిష్కరించుకోవచ్చునని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆలోచిస్తున్నారని తెలిసింది. ఆజాద్ శుక్రవారం మధ్యాహ్నం కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితాలను విశే్లషించిన అనంతరం కొందరు విలేఖరులతో అనధికారికంగా మాట్లాడుతూ జగన్‌ని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలిసింది. జగన్‌ని వదులుకోవటమే మొదటి తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారని అంటున్నారు. జగన్‌ను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళకుండా చూడవలసిందని కూడా ఆయన అన్నట్లు తెలిసింది. జగన్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోగా ఈ లక్ష్యాన్ని సాధించవలసి ఉంటుందని ఆజాద్ అన్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment